న్యూఢిల్లీ: వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న డెల్టా రకం కరోనా వైరస్ త్వరలో ప్రపంచంలోనే అత్యంత ప్రబలమైన కరోనా వేరియంట్గా అవతరించనున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. డెల్టా కేసులు వేగంగా విస్తరిస్తుండటం ఆ వేరియంట్కు వ్యాక్సిన్ అత్యవసరతను పెంచుతున్నదని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. డెల్టా వేరియంట్ కేసులు ఇలాగే పెరిగితే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో ఆరోగ్య వ్యవస్థలు మరోసారి ఇబ్బందులో పడుతాయని, చాలా దేశాలకు లైఫ్ సేవింగ్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రపంచ దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, ముఖ్యంగా అల్పాదాయ, మధ్యతరగతి ఆదాయ దేశాల్లో కరోనా ఎలా విస్తరిస్తున్నది.. ఎలా కొత్త రూపాలు సంతరించుకుంటున్నది అనే సంగతి కూడా తెలియదని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. అదేవిధంగా 2020 సంవత్సరం అంతా నమోదైన కేసుల కంటే 2021 తొలి ఐదు నెలల్లో నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.
ప్రపంచమంతా ఇప్పటికీ కరోనా మహమ్మారి కబంద హస్తాల్లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. అయితే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిందని, దాంతో అక్కడి జనాలు తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా, మరణాలు ఎక్కువగా నమోదు కాకుండా రక్షణ కల్పించినట్లయ్యిందని తెలిపింది. సరిపడా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడం అనేవి కరోనా వ్యాప్తిని మరింత పెంచుతాయని, దాంతో ఎక్కడికక్కడ ఆరోగ్య వ్యవస్థలు కుదేలై ప్రపమంతా కొత్త వేరియంట్లు విజృంభిస్తాయని హెచ్చరిక చేసింది.
ఇక ప్రపంచ దేశాల్లో మహమ్మారి కట్టడి చర్యల కోసం గత బడ్జెట్లో 7.7 బిలియన్ డాలర్ల ఫండ్స్ను కేటాయించినట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఆ నిధులను కరోనా కట్టడిలో ఈ కింది చర్యల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.