న్యూఢిల్లీ : యుద్ధంలో ఉక్రెయిన్పై పట్టు సాధించేందుకు రష్యా ప్రమాదకర చర్యలకు దిగుతున్నది. ఉక్రెయిన్పై వాక్యూమ్ బాంబులతో దాడి చేస్తూ రష్యా విధ్వంసం సృష్టించిందని అమెరికాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో ఆరోపించింది. దీంతో ఉక్రెయిన్లోని పలు నగరాల్లో బాంబు దాడితో వేడి పెరిందని ఒక్సానా మార్కరోవా పేర్కొన్నారు. రష్యా ఇవాళ వాక్యూమ్ బాంబును ఉపయోగించారని, రష్యా ఉక్రెయిన్పై చేయాలనుకుంటున్న విధ్వంసం చాలా పెద్దదన్నారు.
ఇదిలా ఉండగా.. వాక్యూమ్ బాంబ్ లేదా థర్మోబారిక్ ఆయుధం అనేది చాలా విధ్వంసకరమైనది. బాంబ్ విస్పోటనం చెందిన సమయంలో అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. అయితే ఈ అధిక ఉష్ణోగ్రత కోసం చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ను పీల్చుకుంటుంది. సాధారణంగా సాంప్రదాయిక పేలుడు పదార్థం కంటే చాలా ఎక్కువ వ్యవధిలో పేలుడు తరంగాన్ని వెలువరిస్తుంది. మానవ శరీరాలను ఇవి చిన్నాభిన్నం చేయగలవు. అయితే ఉక్రెయిన్లో థర్మోబారిక్ ఆయుధాలు వినియోగించినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు.
శనివారం ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో రష్యా థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్ను గుర్తించినట్లు సీఎన్ఎస్ నివేదించింది. వాక్యూమ్ బాంబ్ వార్తలపై వైట్హౌస్ సెక్రెటరీ జెన్ ప్సాకీ స్పందించారు. తాను నివేదికలు చూశానని, రష్యా అలాంటి ఆయుధాలు ఉపయోగించినట్లు ఇంకా ధ్రువీకరణ కాలేదన్నారు. అదే నిజమైతే అది యుద్ధ నేరం అవుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు వాటిని అంచనా వేయగలవని పేర్కొన్నారు. అయితే, ఇంతకు ముందు 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆఫ్ఘనిస్థాన్లోని వాక్యూమ్ బాంబ్ను వాడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.