కరాచీ: బిపర్జాయ్ తుఫాన్(Cyclone Biparjoy) పాకిస్థాన్లోనూ ప్రభావం చూపుతోంది. తీర ప్రాంతం వెంట నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్న చిన్న దీవుల్లో ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు. గురువారం రోజున బిపర్జాయ్ తీరం దాటనున్న నేపథ్యంలో పాక్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. థాటా జిల్లాలోని కేతి బండార్ నుంచి గుజరాత్ తీరం మధ్య తుఫాన్ తీరం దాటే ఛాన్సు ఉంది. థాటా, బదిన్, సజావల్, తార్పార్కర్, కరాచీ, మిర్పుర్కాస్, ఉమర్కోట్, హైదరాబాద్, ఒర్మారా, తాంటో అల్లయార్, తాండో ఖాన్ ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
దాదాపు 60 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సింద్ ప్రావిన్సు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో 37 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. డిజాస్టర్, మెడికల్ బృందాలు రెఢీగా ఉన్నట్లు పాక్ నేవీ తెలిపింది. కరాచీని తుఫాన్ నేరుగా తాకకపోయినా అక్కడ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మంత్రి రెహ్మాన్ తెలిపారు.
కరాచీలో రేపు, ఎల్లుండి తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది. అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశించారు. పాక్లో గత ఏడాది వచ్చిన ఆకస్మిక వరదల్లో 1700 మంది మృతిచెందారు.