బ్యూనస్ ఏరిస్: అర్జెంటీనాకు చెందిన ప్రఖ్యాత క్రిప్టో మిలియనీర్(Crypto millionaire) ఫెర్నాండో పీరజ్ అల్గబా గత కొన్నాళ్ల నుంచి ఆచూకీ లేని విషయం తెలిసిందే. అయితే అతను హత్యకు గురైనట్లు తేలింది. అతని శరీరానికి చెందిన భాగాలను ఓ సూట్కేసులో గుర్తించారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏరిస్ నది సమీపంలో ఆ సూట్కేసు దొరికింది. నది సమీపంలో ఆడుకుంటున్న కొంతమంది పిల్లలకు ఆ సూట్కేసు కనిపించింది.
జూలై 19వ తేదీ నుంచి అతను ఆచూకీలో లేడు. అయితే పిల్లలకు చెందిన పేరెంట్స్ ఆ రెడ్ సూట్కేసు గురించి ఫిర్యాదు చేశారు. ప్యాకేజీలో ఫెర్నాండో కాళ్లు, చేతులు ఉన్నట్లు తెలిపారు. తల, మొండాన్ని కూడా బుధవారం పోలీసులు గుర్తించారు. చాలా క్లీన్గా శరీర భాగాలను కోసేశారని, అదో ప్రొఫెషనల్ వర్క్లా కనిపిస్తుందని పోలీసులు వెల్లడించారు.
ఫెర్నాండో మృతదేహాన్ని అటాప్సీకి పంపారు. అయితే అతని శరీరంలో మూడు బుల్లెట్లు దిగినట్లు పోలీసులు తెలిపారు. వేలిముద్రలు, భిన్నమైన టాటూల ద్వారా అల్గబాను గుర్తించినట్లు చెప్పారు. లగ్జరీ వాహనాలను రెంట్కు ఇచ్చేవాడు. క్రిప్టోలను అమ్ముతూ అతను మిలియనీర్గా మారాడు. ఇన్స్టాగ్రామ్లో అతనికి 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫెర్నాండో పీకల్లోతు అప్పుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని పర్స్ కానీ, ఫోన్ కానీ ఇంకా పోలీసులకు చిక్కలేదు.