ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ద్రవ్యోల్భణం అధికమవడంతో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ జీవనం నెట్టుకొస్తున్నారు. దీనికితోడు దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతున్నది. ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేసే నాయకత్వం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం (Economic and Political crisis) ఇలాగే కొనసాగితే మరోసారి సైనిక పాలన (Military takeover) వచ్చే అవకాశం ఉందని పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ సీనియర్ నాయకుడు షాహిద్ ఖకాన్ అబ్బాసీ (Shahid Khaqan Abbasi) హెచ్చరించారు.
సైన్యం ప్రభుత్వ పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోవడానికి దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు సరిపోతాయని చెప్పారు. గతంలో తీవ్రత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా సైన్యం జోక్యం చేసుకున్నదని గుర్తుచేశారు. దీనిని నివారించడానికి పాలకులు తగిన చర్యలు తీసుకోవాలని అబ్బాసీ సూచించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు లేదా రాజ్యాంగ బద్ధ సంస్థలు, రాజకీయ నాయకత్వం మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు మార్షల్ లా (Martial law) కు అవకాశం ఉంటుందన్నారు.
పాకిస్థాన్లో ఆర్థికవ్యవస్థ నానాటికీ దిగజారుతున్నది. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో, అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. రూపాయి విలువ పడిపోవడంతోపాటు ద్రవ్యోల్బణం రెట్టింపవుతూ వస్తున్నది. ఈ దారుణ పరిస్థితుల నుంచి బయటపడటానికి బెయిల్ఔట్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం గతకొన్ని రోజులుగా అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరుపుతున్నది. ఈ ప్రయత్నం ఫలప్రధమవుతే దేశానికి 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల బెయిల్ఔట్ ప్యాకేజీ లభించనుంది.