Covid cases : సింగపూర్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోల్చితే డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ వారం నమోదైన కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత వారం 32,035 కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఈ వారం ఏకంగా 56,043 కొత్త కేసులు నమోదయ్యాయి.
దాంతో సింగపూర్ ఆరోగ్యశాఖ వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చే యాత్రికుల కోసం అడ్వయిజరీ జారీ చేసింది. కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నందున టూరిస్టులు, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రాంతాలలో ముఖానికి మాస్క్ ధరించాలని ఆదేశించింది. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంటిపట్టునే ఉండాలనీ, అస్వస్థతకు గురైన వారిని సందర్శించేటపుడు మాస్క్ ధరించాలని సిఫార్సు చేసింది.
విమాన ప్రయాణాలు చేసేవారు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ప్రయాణంలో ఆరోగ్య బీమా తీసుకోవాలని సింగపూర్ సర్కారు కోరింది. దేశంలో కొత్త కేసులు గత వారం కంటే 75 శాతం పెరిగాయని పేర్కొంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు.. ఫ్లూ టీకాలను, కొవిడ్ బూస్టర్ డోసులను తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.