న్యూఢిల్లీ : కరోనా వేళ భారత్లో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. భారత్లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత.. యాంటీబయాటిక్స్ మందుల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు స్టడీలో తెలిపారు. స్వల్ప, మధ్య స్థాయిలో కరోనా వచ్చిన వారికి చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ మందుల్ని అమ్మినట్లు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ స్టడీ చేశారు. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇండియాలో సుమారు 21.6 కోట్ల డోసుల యాంటీబయాటిక్స్ వాడినట్లు నిర్ధారించారు. వీటికి తోడు అదనంగా మరో 3.8 కోట్ల డోసులు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు విచ్చలవిడిగా అమ్ముడుపోయినట్లు స్టడీలో గుర్తించారు.
భారీ స్థాయిలో యాంటీబయోటిక్స్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆ అధ్యయనం నిర్వహించిన సీనియర్ రచయిత సుమంత్ గంద్రా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు యాంటీబయాటిక్స్ వల్ల పెను ప్రమాదం ఉందన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల .. మందులకు తగ్గే ఇన్ఫెక్షన్లు త్వరగా నయం కావన్నారు. అమెరికాలోని బర్నేస్-జువిష్ హాస్పిటల్లో సుమంత్ అసోసియేట్గా చేస్తున్నారు. వ్యాధి నిరోధక మందులను అతిగా వాడడం వల్ల సాధారణ న్యూమోనియా లాంటి వ్యాధుల్ని ట్రీట్ చేయడం ఇబ్బందిగా మారుతుందని సుమంత్ తెలిపారు. దీంతో పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తాయన్నారు.
యాంటీబయాటిక్స్ అమ్మకాలపై నిర్వహించిన స్టడీని పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. జనవరి 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు ఇండియాలోని ప్రైవేటు హెల్త్ సెక్టార్లో నెలనెలా అమ్ముడుపోయిన యాంటీబయాటిక్స్ మందుల వివరాల గురించి ఆ స్టడీలో వెల్లడించారు. ఇండియాకు చెందిన ఐక్యూవీఐఏ బ్రాంచీ నుంచి డేటాను సేకరించారు. కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ కూడా ఈ స్టడీలో భాగస్వామిగా ఉంది. అన్ని రకాల యాంటీబయాటిక్స్తో పాటు ప్రత్యేకంగా అజితోమైసిన్ ఎన్ని అమ్మారన్న దానిపై పరిశోధన చేశారు. కరోనా మహమ్మారి వేళ కొన్ని దేశాల్లో అజిత్రోమైసిన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ డ్రగ్ గురించి స్టడీ చేశారు. గత ఏడాది ఇండియాలో 16.29 బిలియన్ల డోసుల యాంటీబయాటిక్స్ అమ్ముడుపోయినట్లు పరిశోధకులు తేల్చారు. భారత్లో అజిత్రోమైసిన్ అమ్మకాలు 4 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు.
శ్వాసకోస వ్యాధుల ఇన్ఫెక్షన్లకు వాడే డాక్సీసైక్లిన్, ఫారోపెనమ్ లాంటి మందుల అమ్మకాలు కూడా పెరిగినట్లు స్టడీలో తెలిపారు. సంపన్న దేశాల్లో మాత్రం యాంటీబయాటిక్ మందుల వినియోగం తగ్గినట్లు గుర్తించారు. డెంటల్ సర్వీసులు, సర్జరీలు నిలిపివేయడం వల్ల ఆ దేశాల్లో యాంటీబయటిక్స్ అవసరాలు మందగించినట్లు సుమంత్ పేర్కొన్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్గునియా లాంటి వ్యాధులకు వాడే మందుల అమ్మకాలు ఇండియాలో తగ్గినట్లు ఆయన వెల్లడించారు. నిజానికి ఇండియాలో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గాలి,కానీ దానికి విరుద్ధంగా కోవిడ్ కేసుల తరహాలో వాటి వాడకం పెరిగిందన్నారు. భారత్లో కరోనా సోకిన ప్రతి ఒక్కరూ యాంటీబయాటిక్ మందు వాడినట్లు తమ ఫలితాలు తేల్చినట్లు పరిశోధకులు తెలిపారు.