వాషింగ్టన్ : రెండేళ్ల కిందట చైనాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి (Covid-19 Pandemic) ఇంకా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నది. మొన్నటి వరకు డెల్టా, అల్ఫా, బీటా వేరియంట్లు విరుచుకుపడగా.. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కలవరపెడుతున్నది. నవంబర్ నెలాఖరులో వెలుగు చూసిన ఈ కొత్త ఉత్పరివర్తనం ఇప్పటికే దాదాపు సగం ప్రపంచదేశాలకు విస్తరించింది.
గతంలో వచ్చిన వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుండగా.. అంతటా ఈ మహమ్మారికి అంతం ఎప్పుడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమయంలో అమెరికా ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్ (Pyizer) కొవిడ్ అంతంపై కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ప్రభావం 2024 సంవత్సరం వరకు కొనసాగవచ్చని హెచ్చరించింది. ఇటీవల పుట్టుకు వచ్చిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.
కొత్త ఉత్పరివర్తనంలో అసలైన వైరస్ కంటే పెద్ద ఎత్తున మ్యుటేషన్లు ఉన్న విషయం తెలిసిందే. కొత్త వేరియంట్తో టీకా ప్రభావాన్ని సైతం తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఫైజర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైఖేల్ డోల్స్టన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోనా మహమ్మారి పలు ప్రాంతాల్లో వచ్చే ఏడాది లేదంటే రెండేళ్ల పాటు కొనసాగుతుందని అంచనా వేశారు. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ ఇతర అన్ని దేశాలకు వ్యాపిస్తుందని, 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తి చెందుతుందని కంపెనీ అంచనా వేస్తున్నట్లు మైఖేల్ డోల్స్టన్ పేర్కొన్నారు.
వ్యాక్సిన్లు, చికిత్సలతోనే దాని వేగం ఆధారపడి ఉంటుందని తెలిపారు. తక్కువ టీకాలు వేసిన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్కు ముందే అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌసీ యూఎస్లో మహమ్మారి ప్రభావం 2022లో అంతం అవుతుందని అంచనా వేశారు. కానీ, కొత్త వేరియంట్ వేగం పెరుగుతున్న తీరు, ఈ అంచనా తప్పని నిరూపిస్తోంది.
కరోనా మహమ్మారి వ్యతిరేకంగా ఇటీవల ఫైజర్ మరో కొత్త ఔషధాన్ని రూపొందించింది. పాక్స్లోవిడ్ అనే ప్రయోగాత్మక యాంటీవైరల్ డ్రగ్ను తయారు చేసింది. ఈ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్లో దాదాపు 90 శాతం వరకు హైరిస్క్ వ్యక్తుల్లో ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించిందని కంపెనీ ప్రకటించింది.
అయితే, వచ్చే ఏడాది కంపెనీ 15 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా వేసింది. యూఎస్ కంపెనీ ఫైజర్, జర్మనీ బయో ఎన్టెక్తో కలిసి కొవిడ్ టీకాను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది నాటికి 31 బిలియన్ డాలర్లు ఆర్జించే అవకాశం ఉంది. వచ్చే నాలుగు బిలియన్ డోసులు తయారు చేయాలని యోచిస్తున్నది.