ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,13,532.5 కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్లలో విస్త్రుత స్థాయిలో సెంటిమెంట్ బలపడటం దీనికి కారణం. ప్రత్యేకించి బ్యాంకింగ్ షేర్లు బలపడటం విశేషం. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్లో బీఎస్ఈ-30 ఇండెక్స్ 4,445.86 పాయింట్లు లాభపడి 51వేల మైలురాయిని దాటింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ మాత్రం రూ.51,254.37 కోట్లు బలపడి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,19,708.33 కోట్లకు చేరుకున్నది. ఇక బ్యాంకింగ్ షేర్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,13,516.92 కోట్లు లబ్ధి పొందింది. దీంతో మొత్తం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,79,735.51 కోట్లకు పెరిగింది.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రూ.99,063.86 కోట్లు పెంచుకుని దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,50,781.86 కోట్లకు చేరుకున్నది. గత డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఆస్తుల్లో పురోగతి కనిపించడంతో ఎస్బీఐ షేర్ గతవారం 11 శాతానికి పైగా పుంజుకున్నది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.61,836.61 కోట్లు పెరిగి రూ.4,89,877.33 కోట్లకు చేరుకున్నది. మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 53,606.61 కోట్ల లబ్ధి పొందడంతో దాని ఎం-క్యాప్ రూ.4,24,379.96 కోట్లకు ఎగసింది. ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.53,395.91 కోట్లు పెరిగి, మొత్తం దాని ఎం-క్యాప్ రూ.3,92,741.04 కోట్లకు చేరుకున్నది.
ఇక ప్రైవేట్ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ రూ. 48,375.71 కోట్లకు పెరిగి రూ. 3,33,758.06 కోట్లకు చేరుకుంది. ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ. 16,942.01 కోట్లు పెరిగి రూ. 11,85,021.85 కోట్లకు చేరుకుంది. మరో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 13,907.56 కోట్లు పెరిగి రూ. 5,41,947.58 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,632.94 కోట్లు పెరిగి రూ. 5,33,431.50 కోట్లకు పెరిగింది.