లండన్: కరోనా వైరస్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు వ్యాప్తిచెందుతున్నది. బ్రిటన్లో ఓ పెంపుడు కుక్కకు (pet dog) కరోనా వైరస్ సోకింది. దాని యాజమాని వల్లే ఆ శునకం కరోనా బారినపడిందని వైద్యులు వెల్లడించారు. యూకే (united kingdom)లోని వేబ్రిడ్జ్లో ఉన్న యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ (APHA) ల్యాబొరేటరీ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఆ కుక్కకు నవంబర్ 3న పాజిటివ్గా తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం అది చికిత్స పొందుతున్నదని, దాని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.
కాగా, శునకం యజమానికి ఈ మధ్యే కరోనా వచ్చిందని, అతని నుంచే దానికి కరోనా వ్యాపించిందనడానికి ఆధారాలు లభించాయని APHA చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ క్రిస్టిన్ మైడెల్మిస్ చెప్పారు. అయితే ఆ కుక్క వల్ల ఇతర జీవులకు కరోనా వ్యాప్తిచెందినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కుక్కలకు ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదని, కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. కొన్ని రోజుల్లోనే అవి కోలుకుంటాయని వెల్లడించారు.