వాషింగ్టన్, మే 24: కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వచ్చిందన్న వాదనకు మరింత బలం చేకూర్చే ఆధారాలను అమెరికా నిఘా విభాగం బయటపెట్టింది. 2019 నవంబర్ నెలలో వూహాన్లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురయ్యారని తన నివేదికలో పేర్కొన్నది. వారిలో కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. వారంతా దవాఖానలో చికిత్స పొందాల్సి వచ్చిందని వెల్లడించింది. అప్పటికి చైనా ఇంకా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పలేదు. తొలి కరోనా కేసు డిసెంబర్లో నమోదైనట్టు తర్వాత వెల్లడించింది. ఈ ఇంటలిజెన్స్ నివేదికతో వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. కొవిడ్కు కారణమవుతున్న సార్స్ కొవ్-2 వైరస్ పుట్టుకపై దర్యాప్తు నిర్వహించే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కథనం ప్రచురించడం విశేషం. సార్స్ కొవ్-2 వైరస్ చైనాలో ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, ప్రకృతిలో సహజంగానే పుట్టి ఉండవచ్చని డబ్ల్యూహెచ్వో మార్చిలో ప్రకటించింది. అయితే వైరస్ పుట్టుకపై మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో ఈ అంశంపై మళ్లీ సమావేశం అవుతున్నది.
వాల్స్ట్రీట్ కథనాన్ని చైనా ఖండించింది. కథనంలో ఉన్నది నిరాధార రాతలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ఆరోపించారు. వైరాలజీ ఇన్స్టిట్యూట్లో ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదని ఈ ఏడాది మార్చి 23న ఆ ఇన్స్టిట్యూట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వ్యాపించిందని, అయితే ఆ వైరస్ను మొదట తాము గుర్తించామని పునరుద్ఘాటించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న ఫోర్ట్డెట్రిక్ ల్యాబ్లోనూ డబ్ల్యూహెచ్వో దర్యాప్తు చేయడానికి అమెరికా అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ ల్యాబులో కరోనా పుట్టి ఉంటుందని చైనా కొంతకాలంగా ఆరోపిస్తున్నది.
సార్స్ కొవ్-2 వైరస్ సహజంగా వృద్ధిచెందిందంటే తనకు నమ్మకం కలగడం లేదని, వైరస్ పుట్టుకపై లోతైన దర్యాప్తు నిర్వహించాలని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. యూఎస్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను.. ‘కరోనా సహజంగానే పుట్టి ఉంటుందని ఇంకా నమ్ముతున్నారా’ అని ప్రశ్నించగా ‘నాకైతే నమ్మకం కలగడం లేదు’ అని బదులిచ్చారు. ‘చైనాలో ఏం జరిగిందనేదానిపై లోతైన దర్యాప్తు నిర్వహించాలి. వైరస్ పుట్టుకను తెలుసుకొనేందుకు పారదర్శక దర్యాప్తునకు నేను మద్దతిస్తాను’ అని అన్నారు.