టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు. నిప్పాన్ బుడోకన్ హాల్లో నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షురాలు హాజరవుతున్నారు. జూలైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షింజో అబేను ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే వారం క్రితమే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు ఘనంగా ప్రపంచ నేతలు తుది వీడ్కోలు పలికారు. ఇక రేపు జరగబోయే జపాన్ మాజీ ప్రధాని అంత్యక్రియలపై వివాదం చెలరేగుతోంది. షింజో అబేకు రాచరిక రీతిలో ప్రభుత్వ లాంఛనాలతో నివాళి అర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీన్ని ఆ దేశ ప్రజలు కొందరు వ్యతిరేకిస్తున్నారు.
రాచరిక కుటుంబానికి చెందని షింజోకు ఎందుకు ఆ రీతిలో నివాళి అర్పిస్తున్నారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. షింజోకు నివాళిని వ్యతిరేకిస్తూ ఇటీవల ఓ వ్యక్తి పీఎంవో ఆఫీసు ముందు నిప్పు అంటించుకున్న విషయం తెలిసిందే. ఆ అంత్యక్రియలను రద్దు చేయాలని కూడా వేల మంది నిరసన ప్రదర్శన చేపట్టారు. అబే అంత్యక్రియల కోసం జపాన్ సుమారు 11 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని ఇంటి నుంచి షింజో అబే అస్థికలను .. నిప్పాన్ హాల్కు తరలించే రూట్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ దేశాధినేతలు అంత్యక్రియలకు హాజరవుతున్న నేపథ్యంలో సుమారు 20వేల మంది పోలీసులతో భద్రతను కల్పిస్తున్నారు.