డెన్వర్: అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన అత్యున్నత న్యాయస్థానం.. మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను అనర్హుడిగా ప్రకటించింది. స్టన్నింగ్ తీర్పును ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు.. దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ తీర్పుతో కొలరాడో రాష్ట్రంలో ట్రంప్ తన రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి అనర్హుడయ్యారు. కొలరాడో కోర్టు అసాధారణ రీతిలో 4-3 తేడాతో తీర్పును వెలువరించింది. 2021, జనవరి ఆరో తేదీన జరిగిన క్యాపిటల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు. ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ట్రంప్ టీమ్ లీగల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది. మిగితా రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. కానీ 2024లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే కొలరాడో తీర్పు ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి 3వ తేదీ జరగనున్న కొలరాడో ప్రైమరీ ఎన్నికలకు మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుంది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. కొలరాడో తీర్పు వల్ల నవంబర్లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం ఉండే ఛాన్సు ఉంది.
రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం కోర్టు చర్యలు తీసుకున్నది. అయితే క్యాపిటల్ హిల్ దాడితో ట్రంప్ విద్రోహానికి పాల్పడినట్లు కోర్టు ఆరోపిస్తున్నది. బైడెక్ విక్టరీని అడ్డుకుంటూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్పై దాడి చేసినట్లు కోర్టు పేర్కొన్నది.