బొగొట : కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యూపై ఇటీవల కాల్పులు ఘటన జరిగింది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆయనపై కొందరు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బ్లాక్హాక్ హెలికాప్టర్కు బుల్లెట్లు దిగాయి. కానీ అధ్యక్షుడు ఇవాన్కు ఏమీ కాలేదు. ఆ కాల్పుల్ని జరిపింది వామపక్ష గెరిల్లాలు అంటూ రక్షణ మంత్రి డీగో మొలానో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ పోలీసు విభాగం తాజాగా ఇద్దరు అనుమానితుల ఫోటోలను రిలీజ్ చేసింది. అధ్యక్షుడి హెలికాప్టర్పై కాల్పులు జరిపింది వీళ్లే అని, వీరిని పట్టించిన వాళ్లకు మూడు మిలియన్ల డాలర్ల రివార్డు ఇస్తామని ఆ దేశ పోలీసులు తెలిపారు. పోలీసులు రిలీజ్ చేసిన స్కెచుల్లో ఒకరు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ మాదిరిలా ఉన్నారు. అచ్చం జుకర్బర్గ్ను పోలిన ఆ ఊహాచిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు ఫేస్బుక్ సీఈవోనే అధ్యక్షుడిపై దాడి చేయించారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక ఆన్లైన్లో కామెంట్లతో హోరెత్తించారు. కొలింబియా పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన అనుమానితుడి ఫోటో దాదాపు జుకర్బర్గ్ తరహాలో ఉండడంతో ఆ ఫోటోకు సుమారు 66వేల రియాక్షన్లు వచ్చాయి. సుమారు 22 వేల మంది ఆ ఫోటోను షేర్ చేశారు.