మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులకు సంబంధించి రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితే ఇందుకు కారణం. ఉక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా దాదాపు లక్ష మంది బలగాలను మోహరించింది. అమెరికా, ఈయూ దేశాల కూటమి నాటోకు ఉక్రెయిన్ భాగస్వామ్య దేశంగా ఉన్నది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని గద్దెదించి, తమకు అనుకూలమైన వ్యక్తిని కూర్చోబెట్టేందుకు రష్యా యత్నిస్తున్నదని బ్రిటన్ తాజాగా ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. ఉక్రెయిన్లో రష్యా మిలటరీ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉన్నదని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.
ఉద్రిక్తతలకు మూలం ఏంటి?
రష్యా, యూరప్తో ఉక్రెయిన్ సరిహద్దులను పంచుకుంటున్నది. 1991 వరకు సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ తర్వాత విడిపోయింది. 2013లో ఈయూతో ఆర్థిక ఏకీకరణ ప్రణాళికను తిరస్కరించాలన్న అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిడ్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని కీవ్లో ఆందోళనలు రేగాయి. ఇక్కడ అధ్యక్షుడికి రష్యా మద్దతుగా నిలవగా, ఆందోళనకారుల వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఉక్రెయిన్కి చెందిన క్రిమియా రీజియన్ రష్యా ఫెడరేషన్లో చేరే అంశంపై 2014లో ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో చట్టబద్ధ స్వాధీనానికి ముందే రష్యా మిలటరీ క్రిమియాను తన నియంత్రణలో తెచ్చుకున్నది. క్రిమియాతో పాటు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యన్ల హక్కులనూ కాపాడుకుంటామని పుతిన్ నొక్కిచెప్పిన రెండు నెలల తర్వాత డోనేత్సక్, లుహాన్స్క్ రీజియన్లలో రష్యా అనుకూల వేర్పాటువాదులు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకునేందుకు రెఫరెండం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నెలలపాటు రక్తపాతం కొనసాగింది. 2014 నుంచి ఈ వివాదం కారణంగా దాదాపు 3 వేల మంది పౌరులు మరణించారు.
రాజీనామాకు దారితీసిన వ్యాఖ్యలు
యూరప్ సమాఖ్య విధానానికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన జర్మనీ నేవీ చీఫ్ అచిమ్ షాన్బాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రష్యా, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్, జర్మనీలకు రష్యా అవసరం ఉందని అన్నారు. యూరప్ సమాఖ్యలో పుతిన్ అభిప్రాయ భేదాలు సృష్టించగలడని పేర్కొన్నారు.