Climate car puncture | వాతావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో వ్యక్తులు, సంస్థలు పనిచేస్తున్నాయి. ఆందోళన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు వాతావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అంతంతగానే ఉంటున్నది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వ్యక్తి ఏకంగా 8 దేశాలు తిరిగి దాదాపు 900 కార్ల టైర్లలో గాలి తీసేశాడు. వాతావరణ మార్పుల వైపు ప్రజల దృష్టిని ఆకర్శించేందుకే ఇలా చేశానంటున్నాడు ఈయన.
‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం, ‘ది టైర్ ఎక్స్టింగ్విషర్’ పేరుతో క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూప్ ఒకటి ప్రపంచంలోని 8 దేశాల్లో ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చింది. అమెరికాలోని న్యూయార్క్, నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్, ఎన్షెడ్, ఫ్రాన్స్లోని పారిస్, లియోన్, జర్మనీలోని బెర్లిన్, బాన్, ఎస్సెన్, హనోవర్, సార్బ్రూకెన్, యూకేలోని బ్రిస్టల్, లీడ్స్, లండన్, డూండీ, స్వీడన్లోని మాల్మో ఇన్స్బ్రూక్, జ్యూరిచ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్లోని వింటర్థర్లో వాతావరణ మార్పులపై అవగాహన ప్రదర్శనలు జరిగాయి. ఈ గ్రూప్నకు చెందిన ఓ కార్యకర్త దాదాపు 900 కార్ల టైర్లను పంక్చర్ చేశాడు. నగరాల్లో కార్ల సంఖ్య పెరుగుతున్నదని, వీటి వల్ల వాతావరణానికి ముప్పు వాటిల్లే కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.
కార్ల కారణంగానే వాతావరణ విపత్తు కలుగుతున్నదని, గరిష్ఠంగా వాయు కాలుష్యానికి కార్లే కారణమని టైర్లు పంక్చర్ చేస్తున్న వ్యక్తి తెలిపాడు. వాతావరణ మార్పు ప్రపంచం మొత్తానికి అతి పెద్ద సవాల్గా మారిందని విచారం వ్యక్తం చేశాడు. ప్రజల్ని కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నందున మనకు మనమే సహాయం చేసుకోవడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డాడు.