రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన విషయాన్ని వెలువరించింది. ఉక్రెయిన్పై రష్యా బాంబులతో యుద్ధానికి దిగుతుందని చైనాకు ముందే తెలుసంటూ న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసే వరకూ వేచి చూడాలని, అప్పటి వరకూ ఉక్రెయిన్పై దాడికి దిగొద్దంటూ చైనా రష్యాను కోరినట్లు తెలుస్తోంది.
అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తమకు ఈ విషయం తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. వింటర్ ఒలింపిక్స్ ముగిసే వరకూ యుద్ధాన్ని వాయిదా వేయాలని చైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాత్రం చైనా, రష్యా అధ్యక్షులు నేరుగానే మాట్లాడుకున్నారా? లేదా? అన్న విషయం కూడా తేలాల్సి వుంది.
ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రష్యా తన బలగాలను మోహరించినట్లు తమ దృష్టికి వచ్చిందని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఒలంపిక్స్ ముగిసే వరకూ పుతిన్ వేచి చూశారని, అప్పటి వరకూ సైన్యాల మోహరింపుతో పాటు ఇతర విషయాలపై దృష్టి నిలిపారన్న అనుమానం తమకు వస్తోందని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.