Chinese Woman | చైనాలో ఓ మహిళకు ఊహించని ఘటన ఎదురైంది. స్పైసీ ఆహారం తీసుకున్న ఆ మహిళకు తీవ్రమైన దగ్గురావడంతోపాటు ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో వైద్యులను సంప్రదించగా.. నాలుగు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. ఈ ఘటనతో మహిళ సహా వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.
చైనాలోని షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కాస్తంత ఘాటైన ఆహారాన్ని తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన దగ్గు మొదలైంది. అలా దగ్గుతున్న సమయంలో ఛాతిలో నొప్పిరావడంతో వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు గుర్తించారు.
అయితే, దగ్గితేనే ఆమె ఛాతిలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి వైద్యులు కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని వివరించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు.