బీజింగ్, మే 26: చైనా శాస్త్రవేత్తలు ప్రమాదకర ఎబోలా వైరస్లో కొత్త మ్యుటెంట్ను సృష్టించారు. ఎబోలా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి, లక్షణాలపై అధ్యయనం కోసం వైరస్లోని కొన్ని భాగాలను తీసుకొని కొత్త వేరియంట్ను తయారుచేశారు. హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనం వివరాలు ‘సైన్స్ డైరెక్ట్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ను ఐదు మగ, ఐదు ఆడ చిట్టెలుకలకు ఇంజెక్షన్ ద్వారా ఇవ్వగా అవి మూడు రోజుల్లోనే చనిపోయాయి. మనుషులకు ఎబొలా వైరస్ సోకినప్పుడు వివిధ శరీర అవయవాలు విఫలమడంతో పాటు కనిపించిన ప్రమాదకర లక్షణాలే చిట్టెలుకల్లో కూడా కనిపించాయి.
చిట్టెలుకల్లోకి వైరస్ పంపించిన తర్వాత వాటి కనుబొమ్మలు మొత్తం స్రావాలతో నిండిపోయి, చూపు మందగించింది. చనిపోయిన చిట్టెలుకలను పరిశీలించగా గుండె, కాలేయం, ప్లీహం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కడుపు, ప్రేగులు, మెదడు కణజాలంలో వైరస్ ఉన్నట్టు గుర్తించారు. తమ అధ్యయనం విజయవంతమైందని, ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఎలాంటి ఔషదాలు అవసరమో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, కరోనా వైరస్ కూడా చైనాలోని వుహాన్లో ఒక ల్యాబ్ నుంచి బయటకు సోకిందనే ఆరోపణలు ఉన్నాయి.