చైనాలో వింతఘటన వెలుగుచూసింది. 20ఏళ్లుగా ఓ పురుషుడికి రుతుక్రమం అవుతోంది. మూత్రంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తికి షాకింగ్ విషయం తెలిసింది. అతడికి గర్భాశయం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అండాలు విడుదలవుతున్నట్లు గుర్తించారు. జీవశాస్త్రపరంగా అతడు మహిళ అని నిర్ధారించారు.
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెన్ లీ (పేరు మార్చారు) అనే వ్యక్తికి 20 ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తున్నది. ప్రస్తుతం అతడి వయస్సు 33 ఏళ్లు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు మూత్రవిసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. ఇటీవల కడుపునొప్పి నాలుగు గంటలకుపైగా కొనసాగడంతో డాక్టర్ను సంప్రదించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. ఆపరేషన్ చేశారు. అయినా, కడుపునొప్పి తగ్గలేదు.
వైద్యులు అతడికి స్కానింగ్ తీయగా, షాకింగ్ విషయం బయటపడింది. అతడికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అలాగే, మగ సెక్స్హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆడ సెక్స్హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నట్లు కనుగొన్నారు. లీ మగ, ఆడ పునరుత్పత్తి అవయవాలతో ఇంటర్సెక్స్లో జన్మించారని వైద్యులు చివరికి నిర్ధారణకు వచ్చారు. అంటే అతడి మూత్రంలో రక్తం, కడుపునొప్పి అనేది రుతుక్రమం వల్ల వచ్చిందే అని తేల్చారు. ఈ విషయం తెలిసి లీ చాలా బాధపడ్డాడు. స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా, గత నెలలో అతడికి స్పెషలిస్ట్ హాస్పిటల్లో మూడు గంటలపాటు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.