న్యూఢిల్లీ: ప్రవాస టిబెటన్ పార్లమెంటు ఇచ్చిన విందుకు హాజరైన భారత ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖ రాయడం, అభ్యంతరం చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. గతవారం ఢిల్లీలో ఈ విందు జరిగింది. ఈ విందుకు కేంద్ర సహాయ మంత్రి రాజీవ్, బీజేడీ ఎంపీ సుజీత్ కుమార్, కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీశ్ తివారీ, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ హాజరయ్యారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం ఫర్ టిబెట్ సభ్యులకు చైనా ఎంబసీ లేఖ రాసింది. టిబెటన్లకు మద్దతు ఇవ్వవద్దని, ఈ విషయంలో సంయమనం పాటించాలని చైనా ఎంబసీ ఈ ఎంపీలను కోరింది. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఫోరం కన్వీనర్ సుజిత్ కుమార్ అన్నారు. 1959లో చైనా ఆక్రమణ నేపథ్యంలో 14వ దలైలామా ఇండియాకు పారిపోయి వచ్చి ఇక్కడ టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, అరుణాచల్ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లు మార్చడాన్ని చైనా సమర్థించుకొన్నది. ‘టిబెట్కు దక్షిణంగా ఉన్న ప్రాంతం పురాతన కాలం నుంచి చైనాలో అంతర్భాగంగా ఉంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది.