బీజింగ్: చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా గ్వాంగ్జౌ ప్రాంతం నిలిచింది. అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు చైనా విధిస్తున్న జీరో విధానం, కఠిన ఆంక్షలు, నియంత్రణ చర్యలను ఆ దేశ ప్రజలు విమర్శిస్తున్నారు. తప్పనిసరిగా పలుసార్లు కరోనా టెస్ట్లు, లాక్డౌన్లు, క్వారంటైన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కుతున్నారు.
కాగా, చైనీస్ సోషల్ మీడియా వీబోలో వచ్చే విమర్శలపై ఆ దేశ అధికారులు సెన్సార్ విధిస్తున్నారు. మాండరిన్ భాషలో చేసే ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, కామెంట్లను డిలీట్, బ్లాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రజలు కొత్త పద్ధతిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీరో కోవిడ్ విధానాన్ని విమర్శించడానికి మాండరిన్కు బదులుగా కాంటోనీస్ యాసను ఉపయోగిస్తున్నారు.
మరోవైపు ఈ యాసను సెన్సార్ చేసే వ్యవస్థ ఆ దేశ సోషల్ మీడియాలో లేదు. దీంతో కాంటోనీస్ యాసలో చేసే పోస్టులు, కామెంట్లు వీబోలో కనిపిస్తున్నాయి. దీంతో కాంటోనీస్ యాసలో మాట్లాడే ప్రజలు చేసే విమర్శలు ప్రభుత్వ సెన్సార్షిప్ నుంచి తప్పించుకుంటున్నాయని, ప్రభుత్వ సెన్సార్పిష్ను వారు ఈ మేరకు మోసగిస్తున్నారని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మీడియా సంస్థ చైనా డిజిటల్ టైమ్స్ పేర్కొంది.