బీజింగ్: ఒక అమ్యూజ్మెంట్ పార్క్లోని రైడ్ విరిగింది. దీంతో అది చాలా సేపు కదలకుండా ఉండిపోయింది. దానిపై ఉన్న పర్యాటకులు చాలా ఎత్తు నుంచి తలకిందులుగా వేలాడారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. ఫుయాంగ్ నగరంలోని అమ్యూజ్మెంట్ పార్క్ను సందర్శించిన కొందరు పర్యాటకులకు గురువారం భయానక అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన పెద్ద పెండ్యులం రైడ్ జాయింట్ విరిగిపోయింది. దీంతో ఆ రైడ్ పది నిమిషాలపాటు కదలలేదు. ఆ సమయంలో అది చాలా ఎత్తులో ఉన్నది. దానిపై ఉన్న పర్యాటకులు తలకిందులుగా వేలాడారు. కొందరు ప్రాణ భయంతో అరిచారు.
కాగా, ఆ రైడ్ను సరిసేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది చాలా శ్రమపడ్డారు. కంట్రోల్ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో ఒక వ్యక్తి ఆ రైడ్ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. అయితే ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్మెంట్ పార్క్ అధికారులు తెలిపారు. దానిపై చిక్కుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ సంఘటన వల్ల అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.