బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైపై బాగా ప్రభావం చూపింది. ఇటీవల వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సుమారు 9 వేల కేసులు బయటపడ్డాయి. ఇందులో 8,581 మందికి ఎలాంటి లక్షణాలు లేవు. 425 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే వారం రోజులుగా లాక్డౌన్ విధించినప్పటికీ షాంఘైలో కరోనా అదుపులోకి రావడం లేదు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రత్యేక కార్యాచరణకు దిగింది. షాంఘైలోని సుమారు 2.5 కోట్ల మందికి సోమవారం నుంచి సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 36 గంటల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది.
దీని కోసం 20 వేల మందికిపైగా వైద్య సిబ్బందితోపాటు 2,000 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులను షాంఘైకి చైనా పంపింది. అలాగే పీఎల్ఏ వాయుసేనకు చెందిన రవాణా విమానంలో వైద్య సిబ్బంది, టెస్ట్ కిట్లు, మందులతోపాటు సైనికులను చేరవేసింది. షాంఘైకి సమీపంలోని జియాంగ్సు, జెజియాంగ్ ప్రావిన్సుల నుంచి సుమారు 15 వేల మంది వైద్య సిబ్బంది బస్సుల్లో తరలివెళ్లారు. హుబీ, జియాంగ్సీ, షాన్డాంగ్, హైనాన్ వంటి ఇతర సమీప ప్రావిన్సుల నుంచి కూడా వైద్య సిబ్బంది షాంఘైకి బయలుదేరారు.
సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు వైరస్ సోకిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించేందుకు పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బందిని రప్పించినట్లు ఆ దేశ అధికార మీడియా తెలిపింది. మరోవైపు చైనాలో వరుసగా రెండో రోజు కూడా 13 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 13,137 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 11,771 మందికి ఎలాంటి లక్షణాలు లేవని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.