బీజింగ్: చైనాలో భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగింది. శిథిలాల కింద మరో 11 మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 127కు పెరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్హై (Qinghai) ప్రావిన్సులలో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.2గా నమోదయింది.
భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్జ్హౌకు 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్ మీడియా తెలిపింది. ఈ భారీ భూకంపంతో చైనా వణికిపోయింది. వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 130 మంది ప్రాణాలు కోల్పోవడమేగాక 500 మందికిపైగా గాయపడ్డారు.
కాగా, అర్ధరాత్రి భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించినా కొద్ది మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.