బీజింగ్: చైనా దేశానికి చెందిన అలీబాబా (Alibaba), బైడు (Baidu) కంపెనీలు తమ ఆన్లైన్ డిజిటల్ మ్యాప్స్లో (Digital Maps) మార్పులు చేసి కొత్తగా ప్రచురించాయి. అయితే, ఇలా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన మ్యాప్స్లో ఇజ్రాయెల్ (Israel) పేరును ప్రచురించకపోవడం చర్చనీయాంశమైంది. నూతన మ్యాప్లలో ఇజ్రాయెల్ దేశపు అంతర్జాతీయ సరిహద్దులు, పాలస్తీనా భూభాగాలను సూచించిన చైనా కంపెనీలు ఇజ్రాయెల్ పటంపై ఆ దేశం పేరును ప్రచురించలేదు.
లగ్జెంబర్గ్ లాంటి చిన్నచిన్న దేశాల పేర్లను కూడా స్పష్టంగా ప్రచురించిన చైనా కంపెనీలు ఇజ్రాయెల్ పేరును మాత్రం ప్రచురించలేదు. ఇజ్రాయెల్ పేరును ప్రస్తావించకుండా అంతర్జాతీయ సరిహద్దులతో ఆ ప్రదేశాన్ని ఖాళీగా చూపించాయి. ఇజ్రాయెల్ పేరు లేని ఈ డిజిటల్ మ్యాప్లకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని తొలుత అమెరికాకు చెందిన ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ బయటపెట్టగా.. ఆ తర్వాత పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి.
అయితే డిజిటల్ మ్యాప్స్లో ఇజ్రాయెల్ పేరును తీసేయడానికి గల కారణాన్ని మాత్రం అలీబాబా, బైడు కంపెనీలు వెల్లడించలేదని వాల్స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొన్నారు. గాజాలో దాడులను చైనా వ్యతిరేకిస్తున్న వేళ ఈ మ్యాప్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిని చైనా బహిరంగంగా ఖండించ లేదు. కానీ, పౌరుల భద్రత కోసం ఇరు వర్గాలు శాంతిని పునరుద్ధరించాలని ఆ తర్వాత ప్రకటన చేసింది. అంతేగాక, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల చైనా పునరుద్ఘాటించింది.