Amazon Forest | కొలంబియా, జూన్ 12: ఎంతో ప్రమాదకరమైన అమెజాన్ అడవిలో 40 రోజుల పాటు చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులు కొలంబియాలోని మిలటరీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 13, 9, 4 సంవత్సరాలు, 11 నెలల వయసున్న ఈ నలుగురు పిల్లలు ఇన్ని రోజులు ఆ అడవిలో ఎలా జీవించారన్నది ప్రపంచానికి ఆశ్చర్యంగొలిపే విషయం. ప్రస్తుతం వీరికి దవాఖానలో ద్రవరూపంలోనే ఆహారాన్ని ఇస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లల బంధువులు వారిని కలిసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
బాధితుల ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన మాన్యుయ్ రానోక్ మీడియాతో మాట్లాడుతూ.. మే 1న విమానం కూలిన తర్వాత నాలుగు రోజుల పాటు తన తల్లి బతికే ఉందని 13 ఏండ్ల లెస్లీ జాకొబాంబైర్ తనకు చెప్పిందన్నారు. ఈ ప్రమాదకర ప్రదేశాన్ని వెంటనే వదిలిపెట్టి వెళ్లపోండి అని చనిపోయే ముందు ఆమె లెస్లీతో తెలిపింది. ప్రమాదం అనంతరం ఆమెనే పిల్లలకు మార్గదర్శిగా ఉందన్నారు. పిల్లల అంకుల్ ఫిడెన్సియో మాట్లాడుతూ.. చిన్నారులు ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారని తెలిపాడు. అడవిలోని పాములు, జంతువులు, దోమల నుంచి తప్పించుకునేందుకు వాళ్లు చెట్టు తొర్రలో దాక్కున్నారని చెప్పాడు. తమతో మిగిలి ఉన్న కసావా పిండిని కొద్ది కాలం తిన్నారని, అలాగే అడవిలో దొరికే పండ్లు కూడా వారి ఆకలిని నింపాయన్నారు. తమకు ఆడుకోవాలనుందని పిల్లలు తనతో చెప్పారన్నారు.
రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న నికోలస్ ఆర్డోనెజ్ గోమెస్ (Nicolas Ordonez Gomes).. పబ్లిక్ ప్రసార ఛానెల్ ఆర్టీవీసీతో మాట్లాడుతూ.. పిల్లల్ని కలిసిన తర్వాత మొదటి క్షణాలను వివరించారు.
నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లెస్లీ వయసు 13 ఏళ్లు. ఆమె ఒక ఏడాది వయసుగల చిన్నారిని ఎత్తుకుని పరుగులు తీస్తూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. లెస్లీ తన వద్దకు వచ్చి మొట్టమెదటగా ‘నాకు ఆకలి వేస్తోంది’ అని చెప్పిందన్నారు.
ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నారని.. అందులో ఒకరు లేచి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పాడు’అని నికోలస్ వివరించారు. వారి మాటలు విన్న తాము వెంటనే పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ‘మేం మీ స్నేహితులం. మమ్మల్ని మీ కుటుంబ సభ్యులే పంపించారు. మీ నాన్న, మీ అంకుల్ పంపించారు‘ అని పిల్లల్తో చెప్పినట్లు నికోలస్ తెలిపారు.
అమెజాన్ అటవీ ప్రాంతంలోని అరారక్యువరా గ్రామం నుంచి సాన్ జోస్ డెల్కు తల్లి, నలుగురు పిల్లలు, పైలట్, మరో వ్యక్తి చిన్న విమానంలో వెళ్తుండగా కూలిపోయింది. ప్రమాదంలో పైలట్, మరో వ్యక్తి మృతి చెందగా, పిల్లల తల్లి నాలుగు రోజుల తర్వాత మరణించింది. ప్రాణాలతో బయటపడ్డ నలుగురు పిల్లలు 40 రోజుల పాటు అమెజాన్ అడవుల్లోనే తిరిగారు. వారికోసం అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో శుక్రవారం వారిని రక్షించి దవాఖానలో చేర్చారు.