కేపీహెచ్బీ కాలనీ, మే 31: ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అర్హులందరికీ (సూపర్ స్ప్రెడర్స్) కరోనా టీకాలు వేయడం జరుగుతుందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లలోని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. కాలనీలు, బస్తీల్లో కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించే వారికి, గ్యాస్ డెలివరీ సిబ్బందికి, చౌకధరల దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, కిరాణం షాపుల నిర్వాహకులు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లలో పనిచేసే వారిని నిత్య సేవకులుగా గుర్తించి కరోనా టీకాను ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం పకడ్బందీగా నియమాలను రూపొందించిందని వాటన్నింటిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందిని సంప్రదించి మెడికల్ కిట్లు తీసుకోవాలని కోరారు. లక్షణాలు తగ్గకుంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని హోం ఐసొలేషన్లో ఉండాలన్నారు. పేదల కోసం ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సూపర్ స్ప్రెడర్లంతా కరోనా టీకాలు వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీలు కె.రవికుమార్, వి.ప్రశాంతి, ఏఎంహెచ్వోలు సంపత్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఐదు కేంద్రాల ద్వారా సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతుందని జడ్సీ మమత తెలిపారు. సోమవారం జోన్ పరిధిలో 3913 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపారు. వీరిలో 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గలవారు 2985 మం దికి, 44 సంవత్సరాలు పైబడిన వారికి 928 మందికి టీకాలు వేశారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. మూసాపేట సర్కిల్లో 917 మందికి, కూకట్పల్లి సర్కిల్లో 848, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 695, గాజులరామారం సర్కిల్లో 780, అల్వాల్ సర్కిల్లో 773 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు.
కరోనా లక్షణాలను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో సోమవారం 20,046 ఇండ్లలో సర్వే చేసినట్లు తెలిపారు. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 242 బృందాలు సర్వే చేయగా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించిన వారు 54 మంది ఉన్నట్లు గుర్తించి వారికి కరోనా మెడికల్ కిట్లను అందజేశారు. మూసాపేట సర్కిల్లో 5798 ఇండ్లలో సర్వే చేయగా 9 మెడికల్ కిట్లు, కూకట్పల్లి సర్కిల్లో 3830 ఇండ్లలో సర్వే చేయగా 12 మెడికల్ కిట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 4562 ఇండ్లలో సర్వే చేయగా 3 మెడికల్ కిట్లు, గాజులరామారం సర్కిల్లో 2435 ఇండ్లలో సర్వే చేయగా 14 మెడికల్ కిట్లు, అల్వాల్ సర్కిల్లో 3421 ఇండ్లలో సర్వే చేయగా 16 మెడికల్ కిట్లను అందజేశారు.
బాలానగర్: ఫతేనగర్ డివిజన్ భగత్సింగ్పార్క్లో సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ కొనసాగుతుంది. నాలుగు రోజులుగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేస్తుండటంతో ఫతేనగర్ భగత్సింగ్పార్క్ సందడిగా మారింది. మొదటిరోజు 270 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా రెండోరోజు 415 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మూడోరోజు 355 మందికి వ్యాక్సిన్ నాలుగో రోజు 80 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ రంజిత్రెడ్డి తెలిపారు.
మియాపూర్: కూకట్పల్లి జోన్ పరిధిలోని హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సిన్ కేంద్రాన్ని జోనల్ కమిషనర్ మమత డీసీ ప్రశాంతితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ పకడ్బందీగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలుకుగండా అన్ని వసతులను కల్పించినట్లు, ఒక్కో కేంద్రంలో ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమించి వ్యాక్సినేషన్ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ఆల్విన్ కాలనీ డివిజన్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.