టొరంటో, జనవరి 14: విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కెనడా వలసల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నదన్నారు. ‘ఆంక్షల అంశంపై ప్రోవెన్షియల్ ప్రభుత్వాలతో చర్చలు జరపాల్సి వుంది. ప్రావిన్స్లు తమ బాధ్యతను నిర్వర్తించేలా చూడాలి’ అని తెలిపారు.
మరికొద్ది నెలల్లో ఆంక్షలు అమల్లోకి రావొచ్చునని చెప్పారు. కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 2012లో 2,75,000 ఉండగా, 2022నాటికి 8 లక్షలకు చేరుకుంది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఇండ్ల కొరతకు వలసలు ప్రధాన కారణమని ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వలసల్ని నియంత్రించటంలో, ఇండ్ల కొరత సంక్షోభాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థుల రాకపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది.