India-Canada : ఇరుదేశాల మధ్య వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్-కెనడా (India-Canada) దేశాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు (Trade discussions) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కెనడా ఇంధన మంత్రి (Canada Energy Minister) టిమ్ హడ్గ్సన్ (Tim Hodgson) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్ అభివృద్ధి చెందుతోందని హడ్గ్సన్ వ్యాఖ్యానించారు. ఇంధన రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారత్తో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, ఎనర్జీ ట్రేడ్ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
చమురు, గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడం కోసం ఒట్టావా నుంచి భారత్కు ముడి చమురు, పెట్రోలియం, సహజ వాయువులను రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టిమ్ హడ్గ్సన్ తెలిపారు. కెనడా మంత్రితో చర్చల అనంతరం భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మీడియాతో మాట్లాడారు.
ఇరుదేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు, బ్యాటరీ నిల్వ, కీలకమైన ఖనిజాలు, విద్యుత్ వ్యవస్థలు, ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వాడకం వంటి విషయాలపై దృష్టిపెట్టామని చెప్పారు. 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్లో మన వాటా 30-35 శాతం పెరుగుతుందని, భారత్ మూడో అతిపెద్ద ఇంధన మార్కెట్గా నిలుస్తుందని అన్నారు.