ఒట్టావా, జనవరి 23: దేశంలో పెరుగుతున్న ఇండ్ల కొరత, నిరుద్యోగానికి చెక్ పెట్టేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశీ విద్యార్థుల వీసాలపై రెండేండ్లు పరిమితి విధించింది. పరిమితిలో భాగంగా 2024లో ఇప్పుడిస్తున్న వీసాల్లో 35 శాతం కోత విధించనున్నట్టు ఇమ్మిగ్నేషన్ మంత్రి మార్క్ మిల్లర్ వెల్లడించారు.
పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత 3,64,000 మందికి వీసాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుడు 5,60,000 మందికి వీసాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల అనుమతి విధానాన్ని మరింత మెరుగుపర్చి వారికి ఉన్నతమైన విద్యనందించడమే పరిమితి వెనుకున్న ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. 2025కు సంబంధించి జారీ చేసే వీసాల సంఖ్యను ఈ ఏడాది చివర్లో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆ దేశానికి అధిక సంఖ్యలో వెళ్లే భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురైంది.
మాస్టర్స్, డాక్టోరల్ విద్యార్థులకు వర్తించదు
మాస్టర్స్, డాక్టోరల్ విద్యార్థులకు తాజా పరిమితులు వర్తించవని మిల్లర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రావిన్స్ల వారీగా పర్మిట్లను కేటాయిస్తారు. అక్కడి సంస్థలు, వనరుల ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు వాటిని పంపిణీ చేయాలి. ఆయా సంస్థల అనుమతి కోరుతూ వచ్చిన పర్మిట్ల దరఖాస్తులపై ప్రావిన్స్ లేదా టెరిటరీలు ఆమోద లేఖ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు, చేర్పులు చేసేందుకు మార్చి 31 వరకు గడువిచ్చారు.
వర్క్ పర్మిట్లలోనూ మార్పులు
పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లకు సంబంధించిన అర్హతల్లోనూ కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. 2024 సెప్టెంబర్ నుంచి కరికులం లైసెన్సింగ్ అరేంజ్మెంట్స్ విభాగంలో విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఇవ్వబోమని తెలిపింది. అయితే మాస్టర్స్ ప్రోగ్రామ్ కింద నమోదైన గ్రాడ్యుయేట్లు మూడేండ్ల వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు అనుమతించారు.