దుబాయ్: జాతి పిత 152వ జయంతి నాడు ఆ మహాత్ముడు ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై దర్శనమిచ్చారు. గాంధీ గౌరవార్థం.. యూఏఈ ప్రభుత్వం ఇలా ఆయన ఫొటోను భవనంపై ప్రదర్శించింది. ప్రపంచంలోని మీరు కావాలనుకుంటున్న మార్పును మీతోనే మొదలుపెట్టండన్న గాంధీజీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. బుర్జ్ ఖలీఫా దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆయన ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఈ సందర్భంగా కొనియాడింది.
గాంధీ జయంతిని అంతర్జాతీయంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శనివారం ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అహింసతోనే స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఆ మహనీయుడిని ప్రపంచమంతా స్మరించుకుంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ప్రతి ఏటా ఇండియా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల సందర్భంగా మన జాతీయ పతాకాన్ని కూడా ఇలాగే ప్రదర్శిస్తుంది.