ఇస్తాంబుల్: భూకంపంతో తుర్కియేలో బిల్డింగ్లన్నీ శిథిలాలయ్యాయి. వేల సంఖ్యలో భారీ భారీ కాంక్రీట్ కట్టడాలు నేలమట్టమైన విషయం తెలిసిందే. నాణ్యత లేని భవన నిర్మాణ పనులపై తుర్కియేలో ప్రస్తుతం ఆగ్రహాలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే భూకంప మృతుల సంఖ్య 35 వేలు దాటింది. ఆ సంఖ్య 50 వేలకు చేరే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భూకంప ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బిల్డింగ్లు దాదాపు కూలిపోయాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటోంది. 134 మంది బిల్డింగ్ డెవలపర్లపై విచారణ మొదలు పెట్టామని, 114 మంది కోసం అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి బీకిర్ బోజ్డాగ్ తెలిపారు. తాజాగా దేశం వదిలి పారిపోతున్న ఓ ప్రముఖ డెవలపర్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ లగ్జరీ అపార్ట్మెంట్తో లింకు ఉన్న మరో ఇద్దర్నీ కూడా అరెస్టు చేశారు. భూవిలయంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ప్రజలు.. బిల్డింగ్ కాంట్రాక్టర్లను అరెస్టు చేయాలని పోరాటం చేస్తున్నారు.
ఆ ప్యారడైజ్ ఎలా కూలింది..
హటయ్యా ప్రావిన్సులోని అంటక్యాలో కట్టిన రొనిసాన్స్ టవర్లు ఓ అద్భుతం. వాటిని ప్యారడైజ్గా ఆ బిల్డింగ్ డెవలపర్లు కీర్తించారు. చరిత్రాత్మకమైన టర్కీ నగరంలో ఆ బిల్డింగ్లను కట్టిన తీరు అందర్నీ స్టన్ చేసింది. అత్యున్నత ప్రమాణాలతో ఆ బిల్డింగ్లను నిర్మించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తం 249 అపార్ట్మెంట్లు ఉన్న రొనిసాన్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని బిల్డింగ్లు కూలిపోవడం కొందరిలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఆ శిథిలాల కింద వెయ్యి మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు.
హటయ్యా ప్రావిన్సులో 2018, 2019లో కట్టిన బిల్డింగ్లు కూడా కూలాయి. అయితే మొన్నటి వరకు రియల్ వ్యాపారంలో ఉన్న సంస్థలు ఇప్పుడు అక్కడ బిచాణా ఎత్తేశాయి. ఇక రొనిసాన్స్ బ్లాక్ను కట్టిన మెహమత్ యాసర్, హుసేన్ యాసిన్ కోస్కమ్ సోదరులు కనిపించకుండాపోయారు. ఆ రియల్ సంస్థకు చెందిన వెబ్పేజీలు, టెలిఫోన్ లింకులన్నీ డిస్కనెక్ట్ అయ్యాయి. దీంతో బిల్డింగ్ డెవలపర్లపై తుర్కియే ప్రజల్లో అసహనం పెరుగుతోంది.