న్యూఢిల్లీ: సంపన్న కుటుంబానికి చెందిన గుప్తా సోదరుల్ని యూఏఈలో అరెస్టు చేసినట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. అతుల్ గుప్తా, రాజేశ్ గుప్తాలు.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు మంచి మిత్రులు. అయితే ఈ ఇద్దరూ ఆ పరిచయాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు అయిన ఆ ఇద్దర్నీ దక్షిణాఫ్రికాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2018లో ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో వాళ్లపై న్యాయ విచారణ జరిగింది. ఆ సమయంలో ఆ ఇద్దరూ దక్షిణాఫ్రికా వదిలివెళ్లారు. కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఇద్దరూ అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
1993లో గుప్తా ఫ్యామిలీ ఇండియా నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లింది. ఇండియాలోనూ ఆ కుటుంబంపై మనీ ల్యాండింగ్ ఆరోపణలు ఉన్నాయి. 2018లో ఆ కేసుకు సంబంధించి ఐటీశాఖ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టారు. కానీ తాము ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడలేదని గుప్తా సోదరులతో పాటు జుమా కూడా వెల్లడించారు.