లండన్: న్యూజెర్సీ నుంచి లండన్కు వెళ్తున్న ప్రయాణికురాలిపై బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. విమానంలోని మిగితా ప్రయాణికులందరూ నిద్రలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయితే ఆ విమానం లండన్ చేరుకోవడానికి ముందే యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. హీత్రూ విమానాశ్రయంలో రేప్కు పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తిని జనవరి 31వ తేదీన అరెస్టు చేశారు. రేప్ కౌన్సిలింగ్ కేంద్రానికి ఆ మహిళను తీసుకువెళ్లామని, ప్రత్యేక దళాలతో ఆమెకు అదనపు భద్రత కల్పించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. విచారణకు సహకరించనున్నట్లు ఎయిర్లైన్స్ సంస్థ చెప్పింది.