లండన్: ఒక బ్రిటన్ బ్యాంక్ పొరపాటున 130 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1,310 కోట్లు) తన ఖాతాదారులకు చెల్లించింది. క్రిస్మస్ రోజున తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల శాంటాండర్ బ్యాంకులో ఈ ఘటన జరిగింది. సుమారు 2000 కార్పొరేట్, వాణిజ్య ఖాతాదారుల నుంచి 75,000 అదనపు లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు గ్రహించింది. డబ్బులు స్వీకరించే వారికి ఈ ఖాతాల నుంచి రెండు సార్లు చెల్లింపులు జరిగాయని ఆ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సొమ్మంతా ఆయా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల నుంచి కాకుండా బ్యాంక్ రిజర్వ్ నిధుల నుంచి చెల్లింపులు జరిగినట్లు తెలిపింది. ‘క్రిస్మస్ రోజున ఉదయం జరిగిన నకిలీ లావాదేవీలు బ్యాంక్ సొంత నిల్వల నుండి వచ్చాయి. ఆయా ఖాతాదారులకు ఎలాంటి నష్టం లేదు’ అని పేర్కొంది.
కాగా, ఉద్యోగులకు వేతనాలు, సరఫరాదారులకు చెల్లింపుల నేపథ్యంలో ఈ పొరపాటు జరిగినట్లు శాంటాండర్ బ్యాంకు తెలిపింది. షెడ్యూలింగ్ సమస్య వల్ల జరిగిన ఈ పొరపాటును త్వరగా గుర్తించినట్లు పేర్కొంది. డబుల్ లావాదేవీల నగదును తిరిగి పొందేందుకు బ్రిటన్లోని అనేక బ్యాంకులతో కలిసి కృషి చేస్తామని వెల్లడించింది.
మరోవైపు ఖాతాదారులు ఇప్పటికే ఆ డబ్బును విత్ డ్రా చేసి ఉంటే రికవరీ చేయడం చాలా కష్టమని బ్రిటన్కు చెందిన మరో బ్యాంక్ తెలిపింది. ఈ చర్య వల్ల ఖాతాదారులు ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్తారని పేర్కొంది.