లండన్, సెప్టెంబర్ 8: బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్హాం ప్యాలెస్ గురువారం సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు. రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.
ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్హాం ప్యాలెస్కు తీసుకురానున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెను స్కాట్లాండ్లోని బల్మోరా రాజభవనంలో వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వేసవి విడిది కోసం స్కాట్లాండ్ రాజభవనానికి వెళ్లిన క్వీన్ ఎలిజబెత్ అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) గత ఏడాది ఏప్రిల్లో కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, 20 మంది మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. రాణి మరణంపై ప్రపంచ దేశాల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్తోపాటు కామన్వెల్త్ దేశాల్లో 10 రోజులపాటు సంతాప దినాలు పాటించనున్నారు. చివరి రోజున మహారాణి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
అత్యంత విషాదకరం: చార్లెస్
తమ తల్లి మరణం తనకు, తమ కుటుంబానికి అత్యంత విషాదకరమని కింగ్ చార్లెస్ పేర్కొన్నారు. క్వీన్ ఎలిజబెత్ ప్రపంచమంతా ప్రశంసించిన సార్వభౌమాధికారి, తమకు ఎంతో ప్రియమైన తల్లి అని వ్యాఖ్యానించారు. ఆమె మరణం బ్రిటన్, కామన్వెల్త్ దేశాలకు, ప్రపంచంలోని అసంఖ్యాకమైన అభిమానులకు ఎంతో లోటు అని అన్నారు. రాజుగా బాధ్యతలు స్వీకరించిన చార్లెస్ తన తల్లి అంత్యక్రియలకు ముందే తన భార్యతో కలిసి బ్రిటన్ అంతటా పర్యటించనున్నారు. రాణిగా 70 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న తన తదుపరి వారసునిగా పెద్ద కుమారుడు చార్లెస్ను ప్రకటించారు.
ఇందిరతో ఎలిజబెత్
మదర్ థెరిసాతో..
బ్రిటన్ ప్రధాని ట్రస్తో..
తన తండ్రి ఆరో కింగ్ జార్జ్ మరణానంతరం 1952లో తన 25వ ఏటనే ఎలిజబెత్ మహారాణిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె హయాంలో విన్స్టన్ చర్చిల్ నుంచి లిజ్ ట్రస్ వరకు 15 మందిని బ్రిటన్కు ప్రధానమంత్రులుగా నియమించారు. లండన్లో 1926, ఏప్రిల్ 21న జన్మించిన రాణి పూర్తిపేరు ప్రిన్సెస్ ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరి. ఆమె కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా, బ్రిటన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్గా, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్కు సుప్రీం గవర్నర్గా ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్లో భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణానంతరం అధికారిక కార్యక్రమాల్లో ఆమె అతి తక్కువగా పాల్గొంటున్నారు. లాక్డౌన్ నిబంధనలకు తోడు అనారోగ్యం కారణంగా ప్రయాణాలను కూడా నియంత్రించుకున్నారు. ఆమె చివరిసారిగా బోరిస్ జాన్సన్ను కలుసుకొని ఆయన రాజీనామాను ఆమోదించి, ఆయన స్థానంలో లిజ్ ట్రస్ను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల బర్మింగ్హాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడలను రాణి తరఫున ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ ప్రారంభించారు.