కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా రష్యా సైన్యం దూసుకువెళ్తోంది. ఇప్పటికే చెర్నోబిల్ను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని దిశగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా బలగాలు కీవ్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు.. ఆ నగరం సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన బ్రిడ్జ్ను ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. రష్యా సైన్యం దూకుడును అడ్డుకునేందుకు ఆ బ్రిడ్జ్ను పేల్చినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. కీవ్కు ఉత్తరం దిక్కున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెటరివ్ నది సమీపంలో ఉన్న బ్రిడ్జ్ను వైమానిక దాడులతో పేల్చేశారు. కీలకమైన ఈ బ్రిడ్జ్ను పేల్చివేయడం ద్వారా రష్యా బలగాల వేగాన్ని కొంత నిలువరించవచ్చు అని రక్షణశాఖ తెలిపింది. బెలారస్ మార్గం ద్వారా ఉక్రెయిన్లోకి ఎంటరైన రష్యా బలగాలు.. కీవ్కు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇవాళ రెండవ రోజు కీవ్లో బాంబుల మోత మోగింది. తొలి రోజే దాడిలో 137 మంది ఉక్రెయిన్ వాసులు మరణించినట్లు తెలుస్తోంది.