ఒట్టావా: ఒక బాలుడి నాలుక పసుపు రంగుగా మారింది. అరుదైన రుగ్మతే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. కెనడాకు చెందిన 12 ఏండ్ల బాలుడు కొన్ని రోజులుగా గొంతు నొప్పి, కడుపు నొప్పి, చర్మం, కంటి గుడ్లు పసుపు రంగులో, ఎరుపు రంగులో యూరిన్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. టొరంటోలోని పిల్లల ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడ్ని పరీక్షించారు. తొలుత పచ్చకామెర్లుగా వారు అనుమానించారు. అయితే బాలుడి నాలుక కూడా పసుపు రంగులోకి మారడంతో ఆశ్చర్యపోయారు.
పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలుడికి రక్తహీనతతోపాటు ఎపిస్టెయిన్ బార్ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా బాల్యంలో సంక్రమించే సాధారణ వైరస్ అని తెలిపారు. దీని వల్ల బాలుడికి సంక్రమించిన వ్యాధి అనేక స్వయం ప్రతిరక్షక పరిస్థితులతో ముడిపడిందని వెల్లడించారు.
ఆ బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. ఇది ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని, వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందని, ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుందని తెలిపారు. చల్లని వాతావరణ పరిస్థితుల్లో కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వస్తుందని అన్నారు. ఈ వ్యాధి రక్తహీనతకు దారితీస్తుందని చెప్పారు. ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నమవుతాయని, ఫలితంగా బైలిరుబిన్ స్థాయిలు పెరిగి కామెర్లకు దారితీస్తుందని వివరించారు.
బాలుడికి ఎపిస్టెయిన్ బార్ వైరస్ సోకడంతో ఈ అరుదైన వ్యాధి బారిన అతడు పడినట్లు వైద్యులు అనుమానించారు. రక్త మార్పిడితోపాటు రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు నోటి స్టెరాయిడ్లతో చికిత్స అందించినట్లు వివరించారు. దీంతో ఆ బాలుడు కోలుకున్నాడని, డిశ్చార్జ్ అనంతరం అతడి నాలుక పసుపు రంగు నుంచి క్రమంగా సాధారణ రంగులోకి మారిందని తెలిపారు. ఈ అరుదైన రుగ్మతకు సంబంధించిన నివేదికను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.