లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ( Boris Johnson ) సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత బుధ, గురు వారాల్లో అధికారిక పర్యటనల్లో భాగంగా ప్రధాని బోరిస్ జాన్సన్తో కలిసి తిరిగిన సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది. అయినా బోరిస్ జాన్సన్కు సెల్ఫ్ ఐసోలేషన్ అవసరం లేదని బ్రిటన్ ప్రధాని అధికారిక కార్యాలయం డౌన్ స్ట్రీట్ స్పష్టంచేసింది.
బ్రిటన్ ప్రధాని బుధ, గురువారాల్లో ఫిఫేలోని ఓ పోలీస్ కాలేజీని, అబెర్డీన్ షైర్లోని ఓ విండ్ఫామ్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి తిరిగిన సిబ్బందిలో ఒకరు శుక్రవారం స్కాట్లాండ్కు వెళ్లిరాగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్గా తేలినా ప్రధానికి ఐసోలేషన్ అక్కర్లేదని డౌన్ స్ట్రీట్ పేర్కొంది. అన్ని రకాల కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రధాని పర్యటనలు కొనసాగుతున్నాయని, సిబ్బందిలో ఏ ఒక్కరితోనూ ప్రధాని క్లోజ్ కాంటాక్ట్లో ఉండే అవకాశం లేదని డౌన్ స్ట్రీట్ సిబ్బంది వెల్లడించారు.
కాబట్టి సిబ్బందిలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా ప్రధానికి ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నది. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలు ప్రజలను ఫూల్స్ను చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు తమకు ఓ రూల్, దేశ ప్రజలందరీకి ఒక రూల్ను అమలు చేస్తున్నారనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పారు.