రియో డి జనీరో, జనవరి 9: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, కాంగ్రెస్ భవనాలలోకి చొరబడ్డారు. సెక్యూరిటీ వలయాలను ఛేదించి, బారికేడ్లను తొలగించిన ఆందోళనకారులు పెద్దయెత్తున ఈ భవనాల్లోకి ప్రవేశించారు. భవనాల పైకప్పుల పైకి సైతం ఎక్కిన ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. కిటికీలు, తలుపులతో పాటు లోపల ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా ప్రమాణస్వీకారం చేసిన వారం తర్వాత ఈ విధ్వంసకర సంఘటన చోటుచేసుకుంది.
గత ఏడాది అక్టోబర్లో జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే తన ఓటమిని ఆయన ఒప్పుకోక ఎన్నికల విధానాన్ని, సుప్రీంకోర్టును విమర్శిస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన మద్దతుదారులు రోడ్లను దిగ్బంధించడం, వాహనాల దహనం, మిలటరీ కార్యాలయాల ముందు పెద్దయెత్తున గుమిగూడటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వేలమందితో బ్రెజిల్లో విధ్వంసానికి పాల్పడ్డారు.
200 మంది అరెస్ట్
మిలటరీ వెంటనే జోక్యం చేసుకుని మాజీ అధ్యక్షుడు బోల్సొనారోని తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం గాని లేదా ప్రస్తుత అధ్యక్షుడు లులాను పదవి నుంచి దించివేయడం కాని చేయాలని పలువురు ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విధ్వంసంతో తొలుత షాక్ తిన్న భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆందోళనకారులను అణచివేయడానికి పోలీసులు పెద్దయెత్తన టియర్ గ్యాస్ను ప్రయోగించారు. సాయంత్రానికి ఆందోళనకారుల ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకున్నామని, 200 మందిని అరెస్ట్ చేశామని బ్రెజిల్ న్యాయ శాఖ మంత్రి ఫ్లావియో డినో మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని, దానిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండేళ్ల క్రితం జనవరి 6న అమెరికాలోనూ ఇదే తరహా విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ విజయం సాధించడాన్ని తట్టుకోలేని మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు కూడా ఇదే విధంగా దేశంలో విధ్వంస చర్యలకు పాల్పడటం తెలిసిందే.