Plane Crash | బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తు్న్న సైనిక విమానం రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
బొలీవియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. Lockheed C-130 Hercules విమానం శాంటాక్రూజ్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకుని.. రాజధాని పక్కనే ఉన్న ఎల్ ఆల్టో విమానాశ్రయానికి బయల్దేరింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ల్యాండింగ్ సమయంలో రన్ వే దాటి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపైనా కనీసం 5 వాహనాలను ఢీకొంటూ వెళ్లింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. 30 మంది గాయపడ్డారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు రోడ్డుపై వెళ్తున్న సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
🇧🇴
Bolivian Air Force (FAB) Hercules C-130 aircraft crashed onto a busy avenue in the city of El Alto, just outside the capital, La Paz. pic.twitter.com/iovRGPDP9d— Contact Lines (@Izo526470677386) February 28, 2026
సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని బొలీవియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. విమానం క్రష్ అయిన సమయంలో నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన కరెన్సీ నోట్లను ప్రజలు ఏరుకునేందుకు పోటీ పడ్డారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, ప్రమాదంలో చెల్లాచెదురైన కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్లు లేవని.. ఆ నోట్లు ఇంకా చట్టబద్ధమైన కరెన్సీగా మారలేదని సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ ఎస్పినోజా స్పష్టం చేశారు. ఆ కరెన్సీని చలామణీలోకి తీసుకొచ్చే ముందు లా పాజ్కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు.