కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలోని బుచా పట్టణంలో సామూహిక సమాధుల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న బుచాలో ఆ దేశ సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది. డజన్ల సంఖ్యలో ప్రజలను చంపి చర్చి సమీపంలోని శ్మశానవాటిక వద్ద సామూహిక సమాధిలో పూడ్చినట్లు విమర్శించింది. రష్యా సైన్యం వీడిన బుచా నగరాన్ని ఉక్రెయిన్ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఈ నేపథ్యంలో 40 అడుగుల లోతైన గోతిలో సామూహికంగా ఖననం చేసిన మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు వెలికి తీస్తున్నారు. రష్యా యుద్ధ నేరాలపై దర్యాప్తు కోసం ఈ చర్య చేపట్టారు. సామూహిక సమాధిని తవ్వి అందులో పూడ్చిన మృతదేహాలను క్రేన్ల సహాయంతో వెలికి తీస్తున్నారు. చాలా మృతదేహాలను నల్లని జిప్ బ్యాగ్లో ఉంచి ఖననం చేసినట్లుగా గుర్తించారు. రష్యా సైనికులు కొందరిని కాల్చి చంపి మరణశిక్షలు విధించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, రష్యా యుద్ధ దారుణాలకు బుచా నగరం వేదికగా నిలుస్తున్నది. చాలా మంది పౌరులు రోడ్ల పక్కగా చనిపోయారు. కొందరి చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కొందరి తలలో బులెట్ గాయాలున్నాయి. రష్యా దళాలు బుచా నగరాన్ని వీడిని తర్వాత ఈ ఫొటోలు, వీడియోలను ఉక్రెయిన్ విడుదల చేసింది.
మరోవైపు తమ సైన్యంపై ఉక్రెయిన్ చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. రష్యా సైన్యం చేతిలో బుచాలోని ఏ పౌరుడు కూడా హింసకు గురికాలేదని పేర్కొంది. తమపై యుద్ధ నేరాలు మోపాలన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ ఇలాంటి ఫొటోలు, వీడియోలు విడుదల చేసి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని రష్యా ఆరోపించింది.