కీవ్: గత 24 గంటల నుంచి రష్యా భీకర దాడులు చేస్తోంది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో ఉక్రెయిన్లోని 585 పట్టణాలు, గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ మంత్రి యేవెన్ యేనిన్ తెలిపారు. కేవలం కీవ్ను మాత్రమే కాదు, యావత్ ప్రాంతాన్ని భయానకంగా మార్చినట్లు యేనిన్ ఆరోపించారు.
ఉక్రెయిన్లోని విద్యుత్తు సంబంధిత కేంద్రాలను రష్యా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎనర్జీ పరిశ్రమలో భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని యేనిన్ ఆరోపించారు. నార్త్ ఈస్ట్రన్ సుమీ ప్రాంతంలో జరిగిన దాడిలో నలుగురు మృతిచెందారు.
సాధారణ పౌరులు ఎవ్వరూ రష్యా డ్రోన్లను పేల్చరాదు అని ఉక్రెయిన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శిక్షణలేని వ్యక్తులు డ్రోన్లను సరైన రీతిలో నేలకూల్చలేరని, దాని వల్ల గాయాలు అయ్యే రిస్క్ ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగిరే డ్రోన్లను చూసిన వారు ఆ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు.