న్యూఢిల్లీ, జూన్ 16: కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని, ఇది పూర్తిగా పారదర్శకమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి 12-16 వారాలకు ఇటీవల కేంద్రం పెంచిన తెలిసిందే. ఈ నిర్ణయం అశాస్త్రీయమని, వ్యాక్సిన్ కొరత నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్షాలతోపాటు ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బుధవారం స్పష్టతనిచ్చారు. ‘ఇలాంటి కీలక విషయాలను విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకునే ప్రత్యేక వ్యవస్థ మనకు ఉంది. శాస్త్రీయ ఆధారాల ప్రకారమే రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాం. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడుతున్నది. ఏకగ్రీవంగా తీసుకున్నది. ఇలాంటి విషయాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరం’ అని ట్వీట్ చేశారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలకు పెంచడం వల్ల టీకా మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇటీవల బ్రిటన్లో ఓ పరిశోధనలో తేలిందని పేర్కొంటూ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్కే అరోరా విడుదల చేసిన ఓ పత్రాన్ని కూడా హర్షవర్ధన్ జత చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ సభ్యులు మాత్రం కేంద్రం వాదనతో విభేదిస్తున్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 8-12 వారాలకు పెంచాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు. 12-16 వారాల వ్యవధిపై తాము చర్చించలేదని తెలిపారు.
సమిష్టి నిర్ణయం..
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయాన్ని ఎన్టీఏజీఐ కమిటీలోని సభ్యులందరూ కలిసి సమిష్టిగా తీసుకున్నామని ఎన్కే అరోరా చెప్పారు. ఒకవేళ సరైన అధారాలు లభిస్తే.. దాన్ని విశ్లేషించి డోసుల మధ్య వ్యవధి తగ్గింపును పునఃపరిశీలిస్తామని తెలిపారు. ‘వ్యవధి తగ్గించడం వల్ల కనీసం 5 నుంచి 10 శాతం మెరుగైన ఫలితాలు ఉన్నాయని తేలినా కమిటీ దానిపై నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవధినే కొనసాగిస్తాం’ అని అరోరా వివరించారు.
వ్యాక్సిన్లో లేగదూడల సీరం ఉండదు
కేంద్రం, భారత్ బయోటెక్ వివరణ
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ తయారీలో లేగదూడల నుంచి సేకరించిన సీరం వాడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై కేంద్రఆరోగ్యశాఖ స్పందించింది. లేగదూడల సీరంను వ్యాక్సిన్ తయారీలో వినియోగించే వేరో కణాల పెరుగుదలకు మాత్రమే వాడుతారని తెలిపింది. వేరో కణాలు పెరిగాక వాటిని రసాయనాలతో ప్రత్యేక పద్ధతుల్లో శుభ్రం చేస్తారని, సీరం ఆనవాళ్లు పూర్తిగా తొలిగిపోతాయని పేర్కొన్నది. వ్యాక్సిన్కు తుదిరూపం వచ్చేసరికి లేగదూడల సీరం అవశేషాలు ఏమాత్రం ఉండవని స్పష్టం చేసింది. వేరో కణాలు వైరస్ పునరుత్పత్తిని అడ్డుకోవడంలో కీలకమని తెలిపింది. దశాబ్దాలుగా ఇదే విధానంలో టీకాల తయారీ జరుగుతున్నదని పేర్కొన్నది. కొవాగ్జిన్లో లేగ దూడల నుంచి సేకరించిన సీరంను వినియోగించడం సహజమేనని భారత్ బయోటెక్ కూడా తెలిపింది.