Bilawal Bhutto | పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లింలీగ్ – నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ నేత నవాజ్ షరీఫ్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోవడం లేదని తెలిపారు. పీపీపీ అత్యున్నత స్థాయి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. పాకిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో విఫలమైనందున ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పీఎంఎల్ -ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ నాలుగో దఫా పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని మాజీ ప్రధాని షానవాజ్ షరీఫ్ ప్రకటించిన గంటల్లో నవాజ్ షరీఫ్కు బిలావల్ భుట్టో మద్దతు పలుకడం ప్రాధాన్యం సంతరించుకున్నది. పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్థాన్ ఈ ఇన్సాఫ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో తనంతట తాను ప్రధాని పదవికి పోటీ పడబోవడం లేదని బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పేందుకు, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీలతో చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బిలావల్ భుట్టో తెలిపారు.