Britain Demonstration | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. రిషి సునక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది లండన్ వీధుల్లోకి వచ్చి ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శన బ్రిటన్లో గత దశాబ్దంలో జరిగిన అతి పెద్దదిగా వర్ణిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన వారిలో ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్లు, రైలు డ్రైవర్లు ఉన్నారు. జీతాలు పెంచాల్సిందేనంటూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రోడ్డెక్కడంతో రిషి సునాక్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్ల జీతాలు పెంచినట్లయితే.. అది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని సునాక్ ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే బ్రిటన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతున్నది.
గతంలో మాటిచ్చినట్లుగానే జీతాలు పెంచాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని దాదాపు 5 లక్షల మంది ప్రజలు లండన్ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్నవారిలో 3 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనా సమయంలో, అనంతరం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇలా సమ్మెకు దిగడం గందరగోళానికి దారి తీస్తుందని ఉద్యోగుల ప్రదర్శనకు ముందు ప్రధాని కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా నిరసనకు దిగారు. ఇలాఉండగా, తన చేతిలో ఏం మ్యాజిక్ లేదని, ఇదెప్పటికీ జరిగేది కాదని రిషి సునాక్ రెండు రోజుల క్రితమే చెప్పుకొచ్చారు.
సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గంటుండటంతో దాదాపు 23 వేల పాఠశాలలపై ప్రభావం పడిందని నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ తెలిపింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం, 2010 – 2022 మధ్య ఉపాధ్యాయుల జీతాల్లో 9 నుంచి 10 శాతం తగ్గుదల ఉన్నది. రైలు డ్రైవర్లు సమ్మెకు దిగడంతో బ్రిటన్లోని రైళ్లన్నీ నిలిచిపోయాయి. రోజులో 10 గంటలపాటు పనిచేసినా పాస్టా తినాల్సి వస్తున్నదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో జరిగిన అతిపెద్ద ప్రదర్శనను అక్కడి పత్రికలు పతాక శీర్షికన వార్తను ప్రచురించాయి. ‘లాక్డౌన్ 2023’ అని, ‘వాక్అవుట్ వెడ్నెస్డే’ అని, హెడ్డింగులతో హైలైట్ చేశాయి. 1978 లో జరిగిన సమ్మెతో దీనిని పోల్చారు.