వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్పై నోరు పారేసుకున్నారు. వైట్హౌజ్లో జరిగిన ఓ మీటింగ్లో రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. ఆ కార్యక్రమం తర్వాత రూమ్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రశ్నను ఆ రిపోర్టర్ సంధించారు. మధ్యంతర ఎన్నికల వేళ.. ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యతగా భావిస్తారా అని వైట్హౌజ్ కరస్పాండెంట్ అడిగారు. దానికి సమాధానం ఇస్తూ బైడెన్ అసహనానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అంటూనే.. ప్రశ్న వేసిన జర్నలిస్టును తిట్టేశారు. వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ.. అంటూ నోరు జారారు. అయితే ఆ సమయంలో మైక్ ఆన్లో ఉంది. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. రిపోర్టర్ పీటర్ డూసీపై బైడెన్ నోరు జారినట్లు తెలుసుకున్న తర్వాత అందరూ షాకయ్యారు. వాస్తవానికి ఫాక్స్ ఛానల్ రిపబ్లికన్లకు అనుకూలంగా ఉంటుంది. బైడెన్ ప్రభుత్వ విధానాలను కూడా కరస్పాడెంట్ పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతూ ప్రశ్నలు వేస్తుంటారు. కానీ అతనిపై నోరు జారిన నేపథ్యంలో.. ఆ ఘటన జరిగిన గంట తర్వాత బైడెన్ ఆ రిపోర్టర్కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్గా తీసుకోవద్దు అంటూ బైడెన్ కోరారని పీటర్ తెలిపాడు.