వాషింగ్టన్: 2022 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఆరు ట్రలియన్ డాలర్లతో ఆయన బడ్జెట్ను రూపొందించారు. సంపన్న అమెరికన్లపై భారీ స్థాయిలో పన్నులు వసూల్ చేయనున్నారు. కార్పొరేట్ పన్నును 28 శాతానికి పెంచనున్నారు. దండిగా సంపాదిస్తున్న అమెరికన్లపై 39.6 శాతం ఆదాయపన్ను వసూల్ చేయనున్నారు. ప్రతిపాదిత బడ్జెట్లో పలు రకాల సామాజిక పథకాలను కూడా చేర్చారు. వాతావరణమార్పులకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను కూడా పెంచారు. అయితే ఈ ప్రతిపాదిత బడ్జెట్ అమెరికా ఉభయసభలు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
కానీ రిపబ్లికన్ సేనేటర్ లిండ్సే గ్రహమ్ ఆ బడ్జెట్ను వ్యతిరేకించారు. బడ్జెట్ ప్రతిపాదన మరీ పిచ్చి లెక్కగా ఉన్నట్లు ఆయన ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలన సమయంలో కూడా లోటు బడ్జెట్ ఉండేది. ట్రంప్ చివరి ప్రతిపాదిత బడ్జెట్ 4.8 ట్రిలియన్ల డాలర్లుగా ఉంది. అయితే పెంటగాన్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు బైడెన్ సుమారు 1.5 ట్రిలియన్ డాలర్లు కేటాయించారు. ఉద్యోగ కల్పన కోసం 2.3 ట్రిలియన్ డాలర్లు, ఫ్యామిలీ ప్లాన్ కోసం 1.8 ట్రిలియన్ డాలర్లు కేటాయించారు. తాను ప్రతిపాదించిన బడ్జెట్ నేరుగా అమెరికా ప్రజల్లో పెట్టుబడిగా వెళ్తోందని, దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, మన వార్షకి సామర్థ్యం కూడా పెరుగుతుందని బైడెన్ అన్నారు.