వాషింగ్టన్: అమెరికా తమ సేనలను ఉపసంహరించడం వల్లే ఆఫ్ఘన్లో దారుణ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారి స్పందించారు. ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనన్నారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అనుకున్నదానికంటే వేగంగా తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని అన్నారు. సోమవారం శ్వేతసౌధం నుంచి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘సొంత దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని నిలువరించడానికి ఆఫ్ఘన్ సైనికులు, ఆ ప్రభుత్వ నేతలే చిత్తశుద్ధితో పోరాడడం లేదు. అలాంటి యుద్ధంలో పోరాడడానికి ఇంకా ఎన్ని తరాలు అమెరికా సైనికులను పంపమంటారు?’ అని బైడెన్ ప్రశ్నించారు. తాలిబన్లకు భయపడి ప్రజలను విడిచిపెట్టి అధ్యక్షుడే పారిపోయారని చురకలు అంటించారు.